ఎందుకు మార్చారో ప్రజలకు చెప్పండి.. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన జనసేనాని..


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీజీపీ గౌతం సవాంగ్‌  ను మంగళవారం బదిలీ చేసింది
. ఆయన స్థానంలో జగన్ ప్రభుత్వం ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ని కొత్త డీజీపీగా నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీ పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే.. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ జీఏడీలో రిపోర్టు చేయాలని సవాంగ్‌కు ప్రభుత్వం ఆదేశించింది. అయితే.. సవాంగ్ బదిలీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్  ప్రభుత్వాన్ని నిలదీశారు. గౌతమ్ సవాంగ్‌ను ఆకస్మికంగా ఎందుకు మార్చారో ప్రజలకు చెప్పాలని వైసీపీ ప్రభుత్వాన్ని పవన్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా ఈ రోజు మధ్యాహ్నం వరకూ విధుల్లో ఉన్న గౌతమ్ సవాంగ్‌ను ఆకస్మికంగా ఆ బాధ్యతల నుంచి పక్కకు తప్పించడం విస్మయం కలిగించిందంటూ పవన్ ప్రకటనను విడుదల చేశారు. అధికారులను నియమించుకోవడం అనేది ప్రభుత్వానికి ఉన్న పాలనాపరమైన అధికారం కావచ్చు.. కానీ వైసీపీ ప్రభుత్వానికి డీజీపీని హఠాత్తుగా మార్చాల్సిన అవసరం ఏమి వచ్చిందో? ఇందుకుగల కారణాలను ప్రజలకు తెలియజెప్పాలని పవన్ సూచించారు.

లేని పక్షంలో – విజయవాడలో పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగులు చేపట్టిన ర్యాలీ విజయవంతం అయినందుకే సవాంగ్ పై బదిలీ వేటు వేశారని భావించాల్సి వస్తుందని పవన్ పేర్కొన్నారు. ఉన్నతాధికారుల నుంచి చిన్నపాటి ఉద్యోగి వరకూ అందరినీ హెచ్చరించి.. భయపెట్టి.. అదుపు చేసేందుకు సవాంగ్ బదిలీని ఉదాహరణగా చూపించే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉందంటూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ బదిలీ తీరు చూస్తే వైసీపీ ప్రభుత్వం చీఫ్ సెక్రెటరీగా ఉన్న ఎల్వీ సుబ్రమణ్యంను ఆకస్మికంగా పక్కకు తప్పించడమే గుర్తుకు వస్తుందంటూ పవన్ కల్యాణ్ ప్రకటనలో పేర్కొన్నారు