ఏపీలో సమస్యలకు సృష్టికర్త సీఎం జగనే


జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ శనివారం
నాడు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా వైసీపీ శ్రేణులు దౌర్జన్యానికి పాల్పడి చింతా అనంతలక్ష్మీ పూరింటిని కూల్చివేశారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. రాత్రికి రాత్రి 200 మంది రౌడీ మూకలతో ఈ ఘటన జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో ఆపదలో ఉన్న అనంతలక్ష్మీ కుటుంబాన్ని ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారన్నారు.


ఈ మేరకు జనసైనికులు ఇచ్చిన విరాళాలు సేకరించి
రూ.14 లక్షలతో బాధితురాలికి కొత్త ఇల్లు నిర్మించి ఇచ్చామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. శనివారం గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించామని పేర్కొన్నారు. ఏపీలో అన్ని సమస్యలకు సృష్టికర్త సీఎం జగన్ అని నాదెండ్ల వ్యాఖ్యానించారు. ఏ ఒక్క సమస్య పరిష్కారం కోసం ప్రజల తరఫున నిలబడింది లేదంటూ ధ్వజమెత్తారు. సీఎం జగన్ బాటలోనే వైసీపీ ఎమ్మెల్యేలు కూడా నడుస్తున్నారని, దౌర్జన్యాలకు పాల్పడుతూ తమ నియోజకవర్గాలను అభివృద్ధికి దూరం చేస్తున్నారని విమర్శించారు. సీఎం అండతో దౌర్జన్యాలకు పాల్పడుతూ రెచ్చిపోయే విధానం ఎవరికీ మంచిది కాదని నాదెండ్ల హెచ్చరించారు.