కేంద్ర బడ్జెట్ పై ఏపీ ప్రభుత్వం నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. ఇప్పటికే వైసీపీ ఎంపీలు బడ్జెట్ ను తప్పబట్టగా తాజాగా రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్రం విస్మరించిందని ఆయన అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు, పోలవరం, మౌలిక సదుపాయల, పరిశ్రమలు, కేంద్ర ప్రభుత్వ సంస్థల విషయంలో అన్యాయం చేశారని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని బుగ్గన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే కరోనా విపత్కర పరిస్థితులు, పరిమిత ఆదాయ వనరులు, ఇతర రుణాలపై ఆంక్షలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం నుంచి భారీగా నిధుల కేటాయింపు, రుణ సేకరణకు పరిమితులు పెంచి ఉంటే బాగుండేదని బుగ్గన అభిప్రాయపడ్డారు.
అలాగే జాతీయ ఉపాధి హామీ పథకం, రైతులకు ఎరువులు, ఆహార సబ్సిడీ తదితర ముఖ్యమైన అంశాల్లో కేంద్రం రాష్ట్రాలకు కోత విధించిందని బుగ్గన అసంతృప్తి వ్యక్తం చేశారు. జలజీవన్ మిషన్, జాతీయ విద్యా మిషన్, జాతీయ ఆరోగ్య మిషన్ తదితర ప్రాజెక్టులకు నిధులు పెంచినప్పటికీ ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా అవి ఏమాత్రం చాలవన్నారు. జాతీయ ఆరోగ్య మిషన్కు మరిన్ని నిధుల అవసరం ఉందన్నారు.
అదే సమయంలో మరి కొన్ని అంశాలను స్వాగతిస్తున్నట్లు బుగ్గన అన్నారు. దేశాభివృద్ధిలో భాగంగా మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెడుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం స్వాగతించదగినదేనని ఆయన తెలిపారు. అలాగే నేషనల్ మిషన్ బిల్డింగ్ కార్యక్రమంలో రాష్ట్రాలనూ భాగస్వాములు చేస్తూ మౌలిక సదుపాయలను కల్పిస్తే మరింత బాగుండేదని అభిప్రాయపడ్డారు. జీడీపీ 232 లక్షల కోట్లకు పెరగటం స్వాగతించాల్సిన పరిణామంగా భావిస్తున్నాం, ద్రవ్యలోటు, రెవెన్యూ లోటు లు కూడా క్రమంగా తగ్గుదల చూపడం మంచి పరిణామమని చెప్పారు. కోవిడ్ ఇబ్బందుల్లోనూ జీఎస్టీ పన్ను వసూళ్లు 17.65 లక్షల కోట్లకు పెరగటం సానుకూల సంకేతమన్నారు.
రక్షణ రంగానికి 15.23 లక్షల కోట్లు, రైల్వేకు 2.4 లక్షల కోట్లు కేటాయించటం శుభపరిణామమని.. అదే సమయంలో వడ్డీ చెల్లింపులు 9.41 లక్షల కోట్లకు పెరగటం ఆందోళన కలిగించే అంశమని బుగ్గన అన్నారు. రహదారులు, రైల్వే, పోర్టులు, ఎయిర్ పోర్టులు, ప్రజారవాణా వ్యవస్థ, జలరవాణా తదితర మౌలిక సదుపాయాల కోసం జాతీయ స్థాయి ప్రణాళిక మంచి ఆలోచనగా భావిస్తున్నామని చెప్పారు. సూక్ష్మ, చిన్న మద్యతరహా పరిశ్రమలకు అత్యవసర రుణ ప్రణాళికలు, దేశీయంగా ప్రైవేటు పరిశ్రమకు రక్షణ రంగంలో పెట్టుబడులు, పరిశోధన , స్టార్టప్ లకు అవకాశాలు ప్రగతికి సోపానాలుగా ఉంటాయన్నారు.
రాష్ట్రాలకు రుణ సహాయంగా లక్ష కోట్ల నిధి ఏర్పాటు మంచి ముందడుగు అవుతుందని.. సామాజిక ఆస్తుల రూపకల్పన, మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్రాలు ఎక్కువ మొత్తంలో రుణాలు , ఆర్ధిక వనరులు సమీకరించేందుకు అవకాశం కల్పించడం వాటికి ప్రోత్సాహంగా ఉంటుందన్నారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు నిధులు , ఇతర సంస్థల ఏర్పాటుపై బడ్జెట్ లో పేర్కోనక పోవటం నిరుత్సాహం కలిగించే అంశమన్నారు
