భీమిలి నియోజక వర్గం సమస్యల పరిష్కారానికి విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గురువారం అమరావతిలో మంత్రితో భేటీ అయి నియోజకవర్గంలోని పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
2014-19 మధ్య ఫిల్మ్నగర్ కల్చరల్ సెంటర్కు 5 ఎకరాల భూమి కేటాయించి శంకుస్థాపన చేసినా, లీజు గడువు పేర్కొనకపోవడంతో సాంకేతిక సమస్య ఏర్పడిందని గంటా తెలిపారు. వైసీపీ ప్రభుత్వానికి ఫిల్మ్నగర్ ప్రతినిధులు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదని చెప్పారు. లీజు గడువు పేర్కొంటూ భూమి కేటాయించాలని కోరగా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
ఎండాడలో ప్రతిపాదించిన కాపు భవన్కు టీడీపీ ప్రభుత్వం ఎకరం స్థలం కేటాయించగా, వైసీపీ ప్రభుత్వం దాన్ని అర ఎకరానికి కుదించిందని వివరించారు. కాపు భవన్కు ఎకరం స్థలాన్నిస్తూ ఉత్తర్వులు జారీ చేయించాలని కోరారు. సింహాచలం గురుకుల పాఠశాలలో నిలిచిపోయిన భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటానని లోకేష్ భరోసా ఇచ్చారు.
సొంత భవనం లేక ఆనందపురం హైస్కూల్లోని నాలుగు తరగతి గదుల్లో నడుస్తున్న జూనియర్ కాలేజీకి సొంత భవనం కోసం నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పద్మనాభం మండలంలో మాన్సాస్ ట్రస్టు జూనియర్ కాలేజీ ఉండడంతో గతంలో ప్రభుత్వ కాలేజీ మంజూరు చేయలేకపోయామని, ప్రస్తుతం ఆ మండల విద్యార్థులు చదువు కోసం విజయనగరం వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. అక్కడ జూనియర్ కాలేజీ అవసరాన్ని లోకేష్ దృష్టికి తెచ్చారు.
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మధురవాడకు డిగ్రీ కాలేజీ, పి.హెచ్.సి.ని, భీమిలి సి.హెచ్.సి.ని 100 పడకల ఆస్పత్రులుగా ఉన్నతీకరించాలని కోరారు. గూగుల్ డేటా సెంటర్ కోసం భూములిచ్చిన తర్లువాడ రైతులకు పరిహారం చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రత్యేక మహిళా సెజ్ కోసం 100 ఎకరాలు, చిల్లపేట చెరువు సుందరీకరణ, ఆనందపురం జంక్షన్లో అన్న క్యాంటీన్, ఇనాం భూముల సమస్యలపై కూడా సానుకూల స్పందన తెలిపారు.