వర్ధిల్లాలి కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత, స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె ఉధృతి.. వేలాదిమంది కార్మికులతోఉక్కు అడ్మిన్ బిల్డింగ్ ముట్టడి.. ఏలే వాడికి బుద్ధి లేదా? చూసేవాడికి సిగ్గే లేదా? అన్న నినాదాలతో మార్మోగిన ఉక్కు ఉద్యమం.. తుఫాన్ లో తుఫాన్ల సమ్మెను ఉధృతం చేస్తున్న కార్మికులు... చోద్యం చూస్తున్న కూటమి నాయకులు, ఏరు దాటిందాకా వాడ మల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అన్న చందంగా ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని కార్మికులకు అన్యాయం జరుగుతుంటే ముఖం చాటేసిన కూటమి నేతలు.

ఉక్కు కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె ఉధృతి- వేలాది మందితో ఉక్కుఅడ్మిన్ బిల్డింగ్ ముట్టడి. విశాఖ సిటీ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : (సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ ) స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల నిరవధిక సమ్మె ఉదృతం అవుతోంది. నిన్న రీజనల్ లేబర్ కమిషనర్ ఆఫీస్ లో జరిగిన చర్చలు విఫలం కావడంతో ఉక్కుఅఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు అడ్మిన్ బిల్డింగ్ ముట్టడికి పిలుపునిచ్చాయి. స్పందించిన వేలాదిమంది కార్మికులు అడ్మిన్ బిల్డింగును ముట్టడించారు . దీంతో మంగళవారం ఉదయం నుంచి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అడ్మిన్ బిల్డింగ్ ముందస్తు సమాచారం ఉన్న పోలీసులు సైతం భారీగా మోహరించి కార్మికులను లోపలికి వెళ్లకుండా అడ్డుకునేందుకు పూనుకోవడంతో ఇరుపక్షాల మధ్య తోపులాట, తీవ్ర వాగ్వాదం జరిగింది. కొందరు యూనియన్ నాయకులు క్రిందపడిపోయారు. మండుటెండను సైతం ఖాతరు చేయకుండా కార్మికులు బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా అఖిలపక్ష కార్మిక ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ ఎం జగ్గు నాయుడు మాట్లాడుతూ,78 వ వార్డు కార్పొరేటర్ బి.గంగారావులు మాట్లాడుతూ 8 రోజులుగా కాంట్రాక్ట్ కార్మికులు సమ్మె చేస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ,విశాఖ ఎంపీ శ్రీ భరత్ కనీసం పట్టించుకోకపోవడం దుర్మార్గమని అన్నారు. ఉరిశిక్ష వేసే ముందు ఖైదీని కూడా ఆఖరి కోరిక అడుగుతారని 20 నుంచి 30 ఏళ్లుగా పనిచేస్తున్న వేలాదిమంది కాంట్రాక్ట్ కార్మికులను అర్ధాంతరంగా రోడ్డున పడేస్తే వీరి కుటుంబ జీవితాలు ఏం కావాలని ప్రశ్నించారు. కార్మిక చట్టాలను ఉల్లంఘించి విచ్చలవిడిగా కార్మికులను తొలగించడం అన్యాయమని అన్నారు. మోడీ ప్రభుత్వ ఆదేశాలతో కార్మికులను కాంట్రాక్టర్లను బెదిరించి తమకు ఓట్లు వేసి గెలిపించిన కార్మిక కుటుంబాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంటే దీన్ని ఆపాల్సిన బాధ్యత టిడిపి జనసేన బిజెపి కూటమి ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. వీరు కార్మికుల పక్షాన నిలవకుండా, కార్మికులకు అండగా నిలుస్తున్న కార్మిక ప్రజాసంఘాలు ,రాజకీయ పార్టీలపై ప్రెస్ మీట్ లు పెట్టి విషం కక్కడం ఉక్కు కాంటాక్ట్ కార్మికులను ఒంటరి పాటు చేసి దెబ్బ తీసే కుట్రలో భాగమేనని అన్నారు. ఇప్పటికైనా వీరు ఉక్కు కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెకు అనుకూలమా కాదా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కాంటాక్ట్ కార్మికులు చేసే పనులను ఎగ్జిక్యూటివ్ లు ,నాన్ ఎగ్జిక్యూటివ్స్ తో 12 గంటల డ్యూటీలు చేయిస్తూ, పని భారం పెంచుతూ ఉత్పత్తికి విఘాతం కలగలేదని ప్రకటిస్తున్నది. కాంట్రాక్టర్లకు టెండర్లు రద్దు చేస్తామని లేఖలు పంపడం, కాంట్రాక్టర్ల ద్వారా కార్మికులను బెదిరించడం, కార్మికుల బయోమెట్రిక్ నిలిపివేయడం, వీరి స్థానంలో కొత్త వారిని నియమించడానికి కుట్రలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. కొత్త వారితో పని చేయించడానికి స్టీల్ ప్లాంట్ లో మట్టి తయారు చేయడం లేదని, ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన స్టీల్ ఉత్పత్తి అవుతోందని దీనికి పాత స్కిల్డ్ కార్మికులు లేకుండా ఉత్పత్తి అసాధ్యమని ,ఈ విషయం యాజమాన్యానికి తెలిసినా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో కావాలని తొలగింపులకు పూనుకొంటోందని విమర్శించారు. తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకొని, భవిష్యత్తులో ఏ ఒక్కరిని తొలగించకుండా చర్యలు చేపట్టకపోతే ఈ ఉద్యమం మరింత ఉదృతం అవుతుందని హెచ్చరించారు. కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులు నమ్మి రమణ ,మంత్రి రవి,యు.వంశి , యు అప్పారావు,పి భాస్కరరావు తదితరులు మాట్లాడుతూ సమ్మెచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు తొలగిస్తే బయట పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ,విశాఖ ఎంపీ శ్రీ భరత్ వెంటనే జోక్యం చేసుకొని కార్మిక కుటుంబాలకు న్యాయం చేయాలని, ఉపాధిని కాపాడాలని ,తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకునేలా వెంటనే చర్యలు చేపట్టాలని, పోలీసు నిర్బంధాన్ని నిలిపివేయాలని కోరారు. కాంట్రాక్ట్ కార్మికు కుటుంబాల జీవితాల మనుగడకే ప్రమాదం వచ్చినందున కాంట్రాక్ట్ కార్మికులందరూ స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. రేపు 28 న అన్ని గేట్లు వద్ద కరపత్రాలు పంచుతూ సమ్మె జయప్రదానికి కృషి చేయాలని ,9 గంటలకు అడ్మిన్ బిల్డింగ్ వద్ద నిరసన కొనసాగించాలని కాంట్రాక్ట్ కార్మికులకు పిలుపునిచ్చారు.