విశాఖ నగరాన్ని సుందరీ కరణ చేసేందుకు కృషి. జీవీఎంసీ నూతన కమిషనర్ కేతన్ గార్గ్
June 21, 2025
విశాఖ నగర సుందరీకరణకు తొలి ప్రాధాన్యత
స్థానిక ప్రజలు కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధుల సలహాలతో జీవీఎంసీ అభివృద్ధికి కృషి చేస్తా. కమిషనర్ కేతన్ గార్గ్.
విశాఖపట్నం జూన్ 21: ఉత్తరాంధ్ర,ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ :(( సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను ) విశాఖ నగరంలో పారిశుధ్యానికి, సుందరీకరణకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు. శనివారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో జీవీఎంసీ నూతన కమిషనర్ గా బాధ్యతలను స్వీకరించిన అనంతరం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని పారిశుద్ధ్యం, సుందరీకరణకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రజలకు అవసరమయ్యే మౌలిక వసతుల కల్పనలో భాగంగా తాగునీరు, వీధి దీపాలు, కాలువలు, రోడ్లు మొదలైన వాటికి ప్రాధాన్యత కల్పిస్తామని పేర్కొన్నారు. జీవీఎంసీ, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు యొక్క నిధులు సక్రమంగా ఉపయోగించి విశాఖ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రజాప్రతినిధులు, కౌన్సిల్ మేయర్, కార్పొరేటర్ల సలహాలు, సూచనలు పరిగణన లోనికి తీసుకొని అభివృద్ధి చేస్తామని తెలిపారు. రానున్న స్వచ్ఛ సర్వేక్షన్ లో విశాఖ దేశంలోనే ఉత్తమ ర్యాంకు సాధించేందుకు అందరి సహకారంతో కృషి చేస్తానని, విశాఖ అభివృద్ధి దిశగా డి పి ఆర్ ప్రకారం ప్రతిపాదిత మెట్రో ప్రాజెక్టులు, ఫ్లై ఓవర్లుకు జీవీఎంసీ తరఫున సహకారం అందిస్తానని తెలిపారు. నగరంలో గల ఖాళీ స్థలాల ను సుందరంగా తీర్చిదిద్ది అభివృద్ధి చేస్తామని, పార్కులు, కూడళ్ళు అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూస్తామని, మురుగు కాలువలలో క్రాసింగ్ నుండి తాగునీటి పైపులు వెళ్లడం వలన నీరు కలుషితం కాకుండా వాటిని క్రమబద్దీకరిస్తామని తెలిపారు. వర్షాకాలం దృష్ట్యా ప్రధాన కాలువలలోని వ్యర్ధాలు తొలగించేలా చర్యలు చేపడతామని, సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ జ్వరాలపై సీజనల్ సర్వే నిర్వహిస్తామని తెలిపారు. ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టి దోమల నివారణకు పాగింగ్, స్ప్రేయింగ్, సీడ్ బాల్స్ వెదజల్లడం తదితర దోమల నియంత్రణ కార్యక్రమాలను చేపడతామన్నారు. పాత నగరంలోని కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని ప్రజలు ,స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. రోడ్ల అభివృద్ధి పై సర్వే నిర్వహిస్తామని అడ్డంకులు ఉంటే న్యాయపరంగా వాటిని పరిష్కరిస్తామని, బిల్డింగ్ రెగ్యులరైజేషన్ ప్రక్రియ ను పూర్తి చేస్తామని తెలిపారు.
నగరంలో సీసీ కెమెరాలు నిఘా వ్యవస్థను పోలీస్ డిపార్ట్మెంట్ ,జీవీఎంసీ సమన్వయంతో నిర్వహిస్తామన్నారు. విశాఖ నగరాన్ని ఇతర నగరాలతో సిస్టర్ సిటీస్ గా కోలాబరేట్ చేసేందుకు ప్రయత్నిస్తానన్నారు. కోస్టల్ సిటీ అయిన విశాఖ నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్ది అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.